స్పెషల్‌ సాంగ్‌లో అవకాశం అంటూ 5 లక్షలకు టోకరా

19 Jun, 2020 13:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సినిమాలో అవకాశాం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ. 5లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చివరికి తను మోసపోయానని గ్రహించిన ఆ సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఆ యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

విశాఖపట్నంకు చెందిన ఓ యువతి సినిమాలపై మక్కువతో జూనియర్‌ ఆర్టిస్టుగా అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక గీతాలయ స్టూడియోస్‌కు చెందిన గీతా ప్రసాద్‌తో పాటు మరికొంతమంది‌ సదరు యువతిని మాయమాటలతో నమ్మించారు. హైదరాబాద్‌లోని సినిమా వాళ్లతో తనకు అనేక పరిచయాలున్నాయని, ఓ ప్రముఖ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో డ్యాన్స్‌ చేసే అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికారు. అంతేకాకుండా రూ. 10లక్షల పారితోషకం ఇప్పిస్తానని చెప్పిన గీతాప్రసాద్ అండ్‌ గ్యాంగ్‌‌ ఇందుకుగాను తనకు రూ. 5 లక్షల కమీషన్‌ ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే అతడు చెప్పిన మాయమాటలను నమ్మిన ఆ జూనియర్‌ ఆరిస్టు ఒప్పందం ప్రకారం ముందే రూ. 5లక్షలు ఇచ్చింది. డబ్బు ముట్టడంతో ముఖం చాటేసిన గీతప్రసాద్‌ను నీలదీయడంతో చివరికి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులును ఆశ్రయించిన ఆ జూనియర్‌ ఆర్టిస్టు గీతప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు