విశ్వహిందూ మహాసభ చీఫ్‌ కాల్చివేత..!

2 Feb, 2020 10:46 IST|Sakshi

లక్నో : విశ్వహిందూ మహాసభ చీఫ్‌ రంజిత్‌ బచ్చన్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్‌గంజ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన బచ్చన్‌, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్‌ దూసుకుపోవడంతో బచ్చన్‌ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. నిందితుల కోసం ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, ఇటీవల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండోది. గత అక్టోబర్‌లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్‌ తివారీని దుండగులు లక్నోలోని నక ప్రాంతంలో కాల్చి చంపారు. 2015లో ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తివారీ వార్తల్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో ముస్లిం సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్‌ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన తివారీ డిపాజిట్‌ కోల్పోయారు. పలు కేసుల్లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు