వీడిన విశాఖ కిడ్నాప్ కేసు‌ మిస్టరీ

10 Jul, 2020 17:21 IST|Sakshi

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సురేష్‌ కిడ్నాప్‌ కేసు

ఇద్దరు నిందితులను పట్టుకున్న విశాఖ పోలీసులు

కేసు వివరాలు వెల్లడించిన కమిషనర్‌ ఆర్‌కే మీనా

సాక్షి, విశాఖపట్నం: రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సురేష్‌ కిడ్నాప్‌ కేసు మిస్టరీ వీడింది. నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి‌లను విశాఖ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీలు, రైస్‌ పుల్లింగ్‌ వ్యవహారాలే కిడ్నాప్‌నకు ప్రధాన కారణమని తేలింది. విశాఖ కమిషనర్‌ ఆర్‌కే మీనా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి సురేష్‌ను నలుగురు కిడ్నాప్‌ చేసి రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు. కత్తి, తుపాకీతో సురేష్‌ను బెదిరించారు. డబ్బులు లేవని బంగారం ఉందని‌ అతను కిడ్నాపర్లకి చెప్పాడు. సురేష్ తనభార్యకి‌ ఫోన్ చేసి బంగారం తీసుకు రమ్మన్నాడు. అతని భార్య బంగారం తీసుకువచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవలు పడ్డారు. అదే సమయంలో సురేష్ కొడుకు డయల్ 100 కి ఫోన్ చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితులు పారిపోయారు. 
(చదవండి: వ్యాపారి కిడ్నాప్ కేసు‌ దర్యాప్తు ముమ్మరం)

నిందితులు పల్లపు ప్రసాద్ (ఎ 1), ప్రతాప్‌రెడ్డి (ఎ 2)‌లను అరెస్టు చేశాం. ఈ కేసులో మొత్తం ఏడుగురి పాత్ర గుర్తించాం. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. అరెస్ట్ అయినవారిపై రైస్ పుల్లింగ్ తో పాటు పలు కేసులు ఉన్నాయి. నిందితులలో కొంతమందితో సురేష్ కి రైస్ పుల్లింగ్ ద్వారా పరిచయం ఉంది. సురేష్ పైన కూడా కేసులు ఉన్నాయి. కేసులతో పాటు డబ్బులు ఉన్నవ్యక్తిని కిడ్నాప్ చేస్తే త్వరగా డబ్బులు వస్తాయని‌ నిందితులు ఊహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ పై మూడు కేసులు ఉన్నాయి. మరో నిందితుడు ప్రతాప్‌రెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. గతంలో ప్రసాద్‌‌ కూడా రైస్‌ పుల్లింగ్‌ వ్యవహారంలో కిడ్నాప్ కి గురై మోసపోవడంతో ఈజీ మనీ కోసం అదే మార్గాన్ని ఎంచుకున్నాడు.
(విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?)

మరిన్ని వార్తలు