నోటికి ప్లాస్టర్‌ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చి...

1 Nov, 2019 10:05 IST|Sakshi

 ప్రైవేటు పాఠశాలలో కీచకపర్వం  '

 వార్డెన్‌పై దాడి.. కేసు నమోదు 

సాక్షి, ఉట్నూర్‌ రూరల్‌ : కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ వార్డెన్‌ చిన్నారులపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఈ అరాచకానికి ఒడిగడుతున్నాడు. ఈ కీచకపర్వం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల వసతి గృహంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాల అక్కడే హాస్టల్‌ నిర్వహిస్తోంది. విద్యార్థులపై హాస్టల్‌ వార్డెన్‌ కొమ్ము లింగన్న లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్‌కు వివరించినట్లు సమాచారం. 

అయినా సదరు వార్డెన్‌లో మాత్రం మార్పు రాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పిల్లలను అర్ధరాత్రి నిద్ర లేపి లైంగిక వేధింపులకు గురిచేసేవాడని, వినకపోతే నోటికి ప్లాస్టర్‌ అంటించి, అగర్‌బత్తీలతో కాల్చేవాడని పిల్లలు తమకు ఏడుస్తూ విన్నవించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్‌ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్‌ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు