యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల ముద్రణ

5 Mar, 2019 12:36 IST|Sakshi

చెన్నై : అప్పులు భారం నుంచి తప్పించుకోవడానికి దొంగ నోట్ల ముద్రణ ప్రారంభించిన యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. మారియప్ప నగర్‌కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. కుంటుంబ ఇబ్బందుల కారణంగా ఇరుగు పొరుగు వారి వద్ద అప్పులు చేసింది. కానీ వాటిని తీర్చలేకపోయింది. భరణి కుమారికి అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో దిక్కు తోచని భరణి కుమారి యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల ముద్రణ నేర్చుకుంది. ఆ తరువాత ఇంట్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే నకిలీ నోట్లను ముద్రించింది. వాటిని సమీపంలోని కడలూరులో మారుస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలో సోమవారం కడలూరులోని ఓ దుకాణానికి వెళ్లి సామాన్లు కొన్న భరణి నకిలీ రెండు వేల రూపాయల నోటును ఇచ్చింది. అనుమానం వచ్చిన దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల రాకను గమనించిన భరణి సమీపంలోని బస్టాండ్‌కు వెళ్లి చిదంబరం వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది. పోలీసులు బస్టాండ్‌ అంతా వెతికి బస్సులో ఉన్న భరణి కుమారిని అరెస్ట్‌ చేసి విచారణ ప్రారంభించారు. అప్పుల భారం నుంచి తప్పించుకోవడానికే నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించినట్లు భరణి పోలీసుల విచారణలో వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంటి నుంచి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు, ప్రింటర్‌ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు