రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

13 Jun, 2019 13:23 IST|Sakshi
పాంటీ చద్దా, కుమారుడు మోంటీ చద్దా (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : లిక్కర్‌ బారెన్‌ పాంటీ చద్దా కుమారుడు, వేవ్‌ గ్రూపు వైస్ ఛైర్మన్ మణిప్రీత్‌ సింగ్‌ (మోంటీ చద్దా)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ. 100 కోట్ల కుంభకోణం కోసులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. ధాయ్‌లాండ్‌కు పారిపోతుండగా అధికారులు చద్దాను అడ్డుకున్నారు. చౌక ధరలో ఫ్లాట్లను ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చి వినియోగదారులను మోసం చేశారన్న ఆరోపణలపై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉప్పల్-చద్దా హైటెక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వేవ్ గ్రూపు వైస్ చైర్మన్‌ మోంటీ చందాను బుధవారం అరెస్ట్‌ చేశారు. రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారని అధికారులు ఆరోపించారు. చద్దాను గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ ( ఆర్థిక నేరాల విభాగం) సువాష్ష్ చౌదరి తెలిపారు. 

ఘజియాబాద్‌లో హౌటెక్‌ టౌన్‌షిప్‌ పేరుతో కొనుగోలుదారును మోసం చేసిన కేసులో 2018, జనవరిలో మోంటీ చద్దా, ఇతర కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి.  ఈ నేపథ్యంలో వేవ్‌ గ్రూప్‌తోపాటు, ఇతర ప్రమోటర్లపై  లుక్ ఔట్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. రోజ్‌వుడ్‌ ఎన్‌క్లేవ్‌, సన్నీవుడ్‌ ఎన్‌క్లేవ్‌, లైమ్‌వుడ్‌ ఎన్‌క్లేస్‌, చెస్ట్‌వుడ్‌ ఎన్‌క్లేవ్‌ టౌన్‌షిప్‌పేరుతో  గృహకొనుగోలుదారులను ఆక‌ర్షించాడు. ఇళ్ళు, విల్లాలు గోల్ఫ్ కోర్సు, హెలిపాడ్స్, ఇంటర్నేషనల్‌ స్కూలు, కాలేజ్‌,షాపింగ్ మాల్స్ తదితర అత్యాధునిక సదుపాయాలంటూ  వారిని మభ్య పెట్టారు. కానీ ప్లాట్లను వారికి కేటాయించడంలో విఫలమైనారనేది  ప్రధాన అరోపణ. దాదాపు 11 సంవత్సరాలుగా వీరి చేతుల్లో బాధితులు నానా అగచాట్లు పడుతున్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా ఆస్తుల వివాదంలో 2012లో మోంటీ చద్దా తండ్రి  వివాదాస్పద మద్యం వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి పాంటీ చద్దాను గుర్తు తెలియని వ్యక్తులు  కాల్చి చంపారు.  అప్పటినుంచి తండ్రి బాధ్యతలను మోంటీ చేపట్టారు. 

మరిన్ని వార్తలు