వేబ్రిడ్జి మోసాలపై తూనికలశాఖ కొరడా!

24 Jun, 2018 04:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేబ్రిడ్జిల్లో మోసాలపై తూనికలు కొలతలశాఖ కొరడా ఝళిపించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తూనికల కొలతలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ‘వేబ్రిడ్జిలో తూకం తగ్గుతోంది’ అని ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తూకంలో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జిలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు. రీజినల్‌ డిప్యూటీ కంట్రోలర్‌ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జగన్మోహన్‌ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి.

రంగారెడ్డి జిల్లాలో ఆటోనగర్‌లోని పంతంగి వేబ్రిడ్జి, సాగర్‌ రింగ్‌రోడ్డులోని జై హనుమాన్‌ వే బ్రిడ్జి, కర్మన్‌ఘాట్‌లోని ఫైసల్‌ వేబ్రిడ్జి, శంషాబాద్‌లోని రామధర్మకాంట, గోల్డెన్‌ వేబ్రిడ్జిల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని గుర్తించారు. జై హనుమాన్‌ వేబ్రిడ్జి వద్ద తనిఖీలో యజమాని, కంప్యూటర్‌ ఆపరేటర్, లారీ డ్రైవర్లు కుమ్మకైన విషయం వెలుగు లోకి రావడంతో అధికారులు నివ్వెరపోయారు. దీనిపై వారు మరింత లోతుగా తనిఖీలు చేశారు. కంప్యూటర్‌లో ఎంత బరువు నమోదు చేస్తే అంతే వేబ్రిడ్జి తూకం చూపించేట్టుగా చేయడాన్ని అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు