అక్రమంగా ఆయుధాల రవాణా

19 Jan, 2019 09:23 IST|Sakshi
పోలీసులు స్వా«ధీనం చేసుకున్న పిస్టల్,బుల్లెట్లు

ఇద్దరు నిందితుల అరెస్ట్‌  

నాగోలు: నగరంలో అక్రమంగా ఆయుధాలు రవాణా చేస్తున్న ఇద్దరు  అంతరాష్ట్ర నేరస్థుల్ని ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ  పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు పిస్టల్, రెండు  బుల్లెట్స్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ తెలిపిన మేరకు.. మహారాష్ట్ర లోని థానే జిల్లాలోని భివాడీకి చెందిన దత్తు విరేష్‌ కోహ్లి(31), అదే ప్రాంతానికి చెందిన శ్యాం సుందర్, భూమయ్య వాడపల్లిలు కలసి పిస్టల్‌ అమ్మకాలు చేస్తున్నారు. దత్తుకు  ఉత్తరప్రదేశ్‌కు చెందిన జంసీర్‌ అలియాస్‌ హుస్సేన్‌లు పరిచయస్తడు అతని వద్ద  తక్కువ ధరకు ఆయుధాలను కొనుగోలు చేసి మహారాష్ట్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్నాడు.

ఇతనితో పాటు శ్యాంసుందర్‌కూడా మహారాష్ట్ర, తెలంగాణలో అక్రమంగా పిస్టల్స్‌ తీసుకువచ్చి అమ్ముతున్నారు. దత్తు విరేష్‌ కోహ్లీ, శ్యాంసుందర్‌ నగరానికి వచ్చి ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో శ్రీ సాయి లాడ్జిలో మకాం వేశారు. లాడ్జీలో ఉంటూ నగరంలో వీటిని అమ్మేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు, ఎల్‌బీనగర్‌ పోలీసులు దాడి చేసి వీరి వద్ద నుంచి రెండు పిస్టల్స్, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందుతుడైన జంసీల్‌ అలియాస్‌ హుస్సేన్‌ పరారీలో ఉన్నాడని ఇతని కోసం స్పెషల్‌ పార్టీ ఆఫీసర్‌లు గాలింపు చేపట్టారని తెలిపారు. పారిపోయిన నిందితుడికి నగరంలో పాత కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ నవీన్‌ కుమార్, అశోక్‌ రెడ్డి, ఎస్సైలు అవినాష్, రత్నం, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు