మూడు ఆటోలను ఢీకొన్న బస్సు
భయాందోళనకు గురైన పెళ్లి బృందం
జీడిమెట్ల: డ్రైవర్ తప్పతాగి పెళ్లి బృందాన్ని తీసుకువెళుతూ బస్సుతో మూడు ఆటోలతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఇంటి నుంచి బయలుదేరిన రెండు నిముషాల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. సూర్య సాయి ట్రావెల్స్కు చెందిన బస్సు(టీఎస్7యుబి 2519) ఆదివారం సాయంత్రం 5.20 గంటలకు ఐడీపీఎల్ నుంచి ఓ పెళ్లి బృందాన్ని తీసుకుని గాగిల్లాపూర్ వెళ్లేందుకు బయలు దేరింది. అప్పటికే పూటుగా మద్యం తాగి ఉన్న డ్రైవర్ చింతల్ ప్రధాన రహదారి షా థియేటర్ వద్దకు రాగానే ఆటో(ఏపీ28 టీఈ 3062) తో పాటు మరో ద్విచక్ర వాహనం (ఏపీ 28 బివై 0445), మరో రెండు ఆటోలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. ఆటోలో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక కిందకు దిగి పరుగులుతీశారు.
మూడు నిమిషాలకు స్పృహలోకి వచ్చిన డ్రైవర్..
బస్సు డ్రైవర్ను లేపడానికి ప్రయత్నిస్తే మూడు నిముషాల తరువాత లేచాడు. వెంటనే అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అతనికి ప్రథమ చికిత్స చేసి పోలీస్స్టేషన్కు తీసుకు వెళ్లారు. ఈ ఘటన రద్దీగా ఉండే నర్సాపూర్ రాష్ట్ర రహదారిపై జరగడంతో గంటన్నర పాటు తీవ్ర ట్రాఫిక్ జామైంది. ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.