అక్కా.. నువ్వెక్కడా?    

16 May, 2018 11:32 IST|Sakshi
అక్కకోసం ఎదురుచూస్తున్న పిల్లలు, (ఇన్‌సెట్‌)అంబాల స్వరూప

 రంగినేనిట్రస్ట్‌ నుంచి వెళ్లిపోయిన బాలిక

ఇద్దరు చెల్లెల్లు, తమ్ముడి ఎదురుచూపులు

మూడ్రోజులుగా నిరీక్షణ

పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

సిరిసిల్ల : ఆ పిల్లలకు అమ్మానాన్నలు లేరు. ముగ్గురు అమ్మాయిలు.. ఒక్క అబ్బాయి. అందరూ అనాథలే.. సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్‌లో చేరి చదువు సాగిస్తున్నారు. పదోతరగతి పరీక్ష రాసిని అంబాల స్వరూప(17) మూడ్రోజుల క్రితం ఇద్దరు చెల్లెల్లను, తమ్ముడ్ని వదిలేసి ట్రస్ట్‌ నుంచి వెళ్లిపోయింది. ‘అక్కా.. నువ్వెక్కడా’.. అంటూ ఆ చిన్నారులు బెంగతో మూడ్రోజులుగా బిక్కుబిక్కుమంటున్నారు. 

ట్రస్ట్‌లోనే ఎదిగి.. 

ధర్మపురి ప్రాంతానికి చెందిన అంబాల కరుణ– సమ్మయ్య దంపతుల పిల్లలు స్వరూప, సాంబయ్య, సౌజన్య, సంగీత.  కరుణ– సమ్మయ్యలు అనారోగ్య సమస్యలతో మరణించారు. వారి నలుగురు పిల్లలను రంగినేని ట్రస్ట్‌లో ఐదేళ్లకిందట చేర్పించారు. ఇటీవలే స్వరూప పదోతరగతి పాసైంది. మోడల్‌స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌ చేసేందుకు సిద్ధమైంది. తమ్ముడు సాంబయ్య పదోతరగతికి రాగా.. చెల్లెల్లు సౌజన్య 8, సంగీత 7వ తరగతి చదువుతున్నారు. ఆదివారం వేకువజామున స్వరూప ట్రస్ట్‌ నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం ట్రస్ట్‌ నిర్వాహకులు వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు. అక్క జాడ తెలియకపోవడంతో ముగ్గులు పిల్లలు ఆవేదనకు లోనవుతున్నారు. ‘అక్కా.. నువ్వు ఎక్కడ ఉన్నా తిరిగి రావాలంటూ’ వేడుకుంటున్నారు.  

పోలీసులకు ఫిర్యాదు.. 

స్వరూప ట్రస్ట్‌ నుంచి వెళ్లిపోవడంతో నిర్వాహకులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదు చేశారు. స్వరూప ఆచూకీ తెలిసిన వారు సిరిసిల్ల రంగినేని ట్రస్ట్‌కు సమాచారం ఇవ్వాలని, 92906 87853, 92463 18382 నంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.   

మరిన్ని వార్తలు