సాక్షి, హైదరాబాద్ : అర్థరాత్రి సమయంలో వైట్నర్ మత్తులో ఉన్న కొంతమంది అలజడి సృష్టించారు. పూర్తిగా వైట్నర్ మత్తులో మునిగిన వాళ్లు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడి చేసుకుని జనాలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన పాతబస్తీలోని ఫలక్నామా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం అర్థరాత్రి వేళ ఫలక్నామాలో వైట్నర్ల మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు, కొందరు పురుషులు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడిచేసుకున్నారు.
మత్తులో మునిగిన ఓ మహిళ బ్లేడ్తో నరాలు కోసుకోవటంతో అక్కడి జనం భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. వైట్నర్ల మత్తు కారణంగానే వాళ్లు వీరంగం సృష్టించారని తెలిపారు.