ఎవరీ కోటేశ్వరరావు?

9 Apr, 2019 05:34 IST|Sakshi

‘తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సర్వే’ పేరుతో షేర్‌ చేసింది ఇతడే

తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తోందంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పేరుతో బోగస్‌ సర్వేను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిపై కేసు దర్యాప్తులో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు పురోగతి సాధించారు. ఈ వార్తను రూపొందించిన టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఇతడికి సదరు సర్వే విషయం వాట్సాప్‌ ద్వారా కోటేశ్వరరావు అనే వ్యక్తి పంపినట్లు వెలుగులోకి వచ్చింది.

గుంటూరుకు చెందిన ఇతడు టీడీపీ కీలక నేతలకు సన్నిహితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోటేశ్వరరావును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఉన్న భవనం కేంద్రంగా పని చేసిన టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నేతృత్వంలో ఈ  కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. టీఎఫ్‌సీ సంస్థ డైరెక్టర్‌ శాఖమూరి తేజోభాను కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు.  

వైఎస్‌ షర్మిలపై దుష్ప్రచారంలోనూ టీఎఫ్‌సీ పాత్ర?
వైఎస్‌ షర్మిలపై సోషల్‌మీడియాలో జరిగిన దుష్ఫ్రచారం వెనుకా టీఎఫ్‌సీ సంస్థ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితులు దొరికితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి ప్రస్తుతం వీళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు