ఎవరా మహిళ..

8 May, 2018 13:40 IST|Sakshi
యల్లపువానిపాలెంలో వదంతులపై ఆరా తీస్తున్న పోలీసులు

మహిళ దుర్మరణం కేసులో పురోగతి కోసం కసరత్తు

నగర పోలీసులంతా గోపాలపట్నంలో జల్లెడ

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : మంటల్లో కాలి మృతి చెందిన గుర్తు తెలియని మహిళ కేసు మిస్టరీగా మారింది. ఆమె ఎవరన్నదీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల క్రితం కొత్తపాలెం నుంచి నరవ మార్గంలో ఖాళీ మైదానంలో మహిళ మంటల్లో కాలిపోతూ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన రోజు నుంచీ పెందుర్తి, గోపాలపట్నం పోలీసులతో నగర పోలీసులంతా హైఅలెర్ట్‌ అయ్యారు.

క్లూ సంపాదించే దిశగా శ్రమిస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. అన్ని స్టేషన్ల పరిధిలో గాలింపులు చేస్తున్నారు. కళ్ల జోడు ధరించి కాళ్లకు మోడల్‌ చెప్పులు ధరించి, కాళ్లకు మట్టెలు ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కచ్చితంగా వివాహితనే నిర్ధారణకు వచ్చినా.. ఆమె ఎవరన్నదీ మిస్టరీగా మారింది. వీడియో చిత్రాల ఆధారంగా సంఘటనను బట్టి ఆమెను కచ్చితంగా హతమార్చి కాల్చి చంపి ఉండొచ్చన్న సందేహాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసును ఎలాగైనా ఛేదించి తీరాలని జాయింట్‌ పోలీస్‌కమిషనర్‌ రవికుమార్‌మూర్తి పట్టుదలతో ఉన్నారు. అనేక పోలీసు బృందాలతో శోధింపు చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

కలకలం రేపిన తప్పుడు సమాచారం

మహిళకు సంబంధించి క్లూ దొరికిందంటూ ఓ పత్రికలో కథనం వెలువడడంతో పోలీస్‌కమిషనర్‌ యోగానంద్‌తో పాటు జాయింట్‌ సీపీ రవికుమార్‌మూర్తి అప్రమత్తమయ్యారు. అన్ని స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, టాస్క్‌ఫోర్సు అధికారులు, సిబ్బంది, ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచి అధికారులు, సిబ్బందితో గోపాలపట్నాన్ని జల్లెడపట్టారు.

ఏసీపీ అర్జున్‌తో పాటు సీఐ పైడియ్య, స్పెషల్‌బ్రాంచి సీఐ వైకుంఠరావు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ తదతర అధికారులు, పోలీసులు య ల్లపువానిపాలెం అంతా గాలించారు. ఎటువంటి ఆధారం దొరక్కపోవడంతో కేసు శోధిస్తున్న తరుణంలో పోలీసులతో ఆటలేంటని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు