బెంగాల్‌ హింస ఎందుకు కొనసాగుతోంది?

21 Jun, 2019 17:37 IST|Sakshi
ఆందోళన చేస్తోన్న బీజేపీ కార్యకర్తలు

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసాకాండ ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది. ఏ ఎన్నికల సందర్భంగానైనా ఆ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగడం, ఎన్నికల అనంతరం ఆగిపోవడం సాధారణ విషయం. ఈసారి ఎందుకు అలా జరగలేదు ? పైగా ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసలోకన్నా అనంతరం కొనసాగిన హింసాకాండలోనే ఎక్కువ మంది మరణించారు. అక్కడ రాజకీయాలే హింసాత్మకం అయితే ఎందుకు సామాన్య పౌరులు వాటికి దూరం కావడం లేదు ? పైగా ఎంత హింసాకాండ జరిగిన ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ ఎక్కువగా ఉంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 81.85 శాతం పోలింగ్‌ జరిగింది. ఎందుకు?

స్థానిక ప్రజాస్వామ్య బలంగా ఉండడం
పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే, అంటే 1978లో మూడంచెల పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో, సమితి స్థాయిలో, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. ఇక్కడే ఇతర రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు తేడా ఉంది. ఇతర పార్టీలతో, పార్టీ చిహ్నాలతో ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్‌లో పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరుగుతాయి. ఈ కారణంగా పార్టీల బలాబలాలు సమాన స్థాయిలో ఉన్నప్పుడు దిగువ స్థాయి నుంచే అల్లర్లు పుట్టుకొస్తాయి. తణమూల్‌కు సమాన స్థాయిలో బీజేపీ ఎదుగుతూ వచ్చిన విషయం తెల్సిందే.
 

అభివద్ధి కార్యక్రమాలతో విభేదాలు
తణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్లనిర్మాణం, బాల్య వివాహాల నివారణకు పెళ్లీడు వచ్చాక పెళ్లి చేస్తే పెళ్లి కూతురుకి పాతిక వేల రూపాయలను పారితోషికంగా ఇవ్వడం లాంటి పథకాలను అమలు చేస్తోంది. తణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు అన్నదమ్ముల పేరు మీద ఒకటికన్నా ఎక్కువ ఇంట్లను పొందడం, ఇప్పటికీ పంచాయతీ స్థాయిలో బలంగా ఉన్న కమ్యూనిస్టులకు ఒక్క ఇల్లు కూడా దక్కక పోవడం, పెళ్లి కూతురికి పాతికవేల పారితోషకం మంజూరుకు తణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఐదువేల రూపాయలు లంచం తీసుకోవడం విపక్ష కార్యకర్తల్తో కక్షలను రేపాయి. 

2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీలను పోటీ చేయకుండా అడ్డుకోవడం ద్వారా దాదాపు 40 శాతం సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకొంది. అప్పటి నుంచి సీపీఎం, బీజేపీ పార్టీ కార్యకర్తల్లో రగులుతున్న కోపం లోక్‌సభ ఎన్నికల్లో హింసాకాండకు దారితీసింది. అనూహ్యంగా సీపీఎం, సీపీఐ కార్యకర్తలు బీజేపీతో చేతులు కలపడంతో ఇరు పక్షాల మధ్య దాడులు ఎక్కువయ్యాయి. ఇలా కక్షలు, కార్పణ్యాలు పంచాయతీ స్థాయికి పాకడంతో అల్లర్లు సద్దుమణగడం లేదు. 

మరిన్ని వార్తలు