అనుప్పుర్ (మధ్యప్రదేశ్): కట్టుకున్న భర్తను చంపి ఆయన శవాన్ని ఇంట్లోనే పూడ్చి, దానిపై వంటగది ఏర్పాటు చేసిన ఘటన మధ్యప్రదేశ్లోని అనుప్పుర్లో జరిగింది. అనుప్పుర్ దగ్గర్లోని కోట్మాకు చెందిన ప్రతిమ బనవాల్ (32) తన భర్త, లాయర్ మోహిత్ను అక్టోబర్ 22న వైరుతో గొంతు బిగించి చంపింది. అనంతరం ఆధారాలు దాచేందుకు ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి, ఆ ప్రదేశంలో వంటగది ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే మోహిత్ తమ్ముడు అర్జున్ తన అన్న గురించి ప్రతిమను వాకబు చేయగా పొంతన లేని సమాధానాలిచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అర్జున్ ఇరుగుపొరుగువారితో కలసి ఆమె లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి వంటగదిగా ఉపయోగిస్తున్న ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తవ్వి మోహిత్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రతిమను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.