భర్తను కడతేర్చిన భార్య
ప్రియుడితో కలిసి హత్య
సాక్షి, గుడిపాల : తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తపార పంచాయతీకి చెందిన ధర్మరాజులపురంలో రామదాస్(36), మొగిలమ్మ(30) దంపతులు నివాసం ఉంటున్నారు. మొగిలమ్మకు అదే గ్రామానికి చెందిన ఉమాపతి(26)తో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. ఉమాపతికి మొగిలమ్మ రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చింది. అంతేగాక బంగారు నగలు కూడా అందజేసింది. ఈ విషయం మొగిలమ్మ భర్తకు తెలిసింది. అతను డబ్బు, బంగారు ఆభరణాలు ఇప్పించుకోవాలని భార్యను డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మొగిలమ్మ తన ప్రియుడు ఉమాపతిని ఇంటికి పిలిపించుకుంది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి ఇంటిముందు పశువుల పాకలో నిద్రిస్తున్న రామదాస్ను గొంతుకోసి హత్య చేశారు.
ఆ సమయంలో మొగిలిమ్మ తన భర్త కాళ్లు పట్టుకుంది. చేతులను కట్టేసి ఉమాపతి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మొగిలమ్మ ప్రియుడు ఉమాపతిని చిత్తపార బస్టాప్ వద్దకు వెళ్లిపోమని చెప్పింది. తెల్లవారుజామున తన భర్తను ఎవరో చంపేశారంటూ కేకలు పెట్టింది. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు విషయాన్ని గుడిపాల పోలీసులకు తెలిపారు. వెంటనే సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్ఐ షేక్షావలి సంఘటనా స్థలానికి చేరుకుని రామదాస్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మొగిలమ్మను, ఉమాపతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సీఐ లక్ష్మీకాంత్రెడ్డి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా మొగిలమ్మ గతంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో కాణిపాకంలో లాడ్జిలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తపార గ్రామంలో సారా విక్రయిస్తున్నట్లు తెలిసింది.