గోవిందరావుపేట: గోవిందరావుపేట మండలకేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పలువురిని కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. ఆతుకూరి ప్రసాద్(45), స్వరూప(38)లకు 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె నందిని, కుమారుడు అజయ్ సంతానం. కుమార్తెకు మూడేళ్ల క్రితమే పెళ్లి కాగా కుమారుడు హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
భర్త ప్రసాద్ నిత్యం తాగుతూ ఇంటికి వచ్చి భార్యతో గొడవలు పెట్టుకునే వాడని స్థానికులు తెలిపారు. ప్రసాద్ వెల్డింగ్ పనులు చేసుకుంటుండగా, స్వరూప రోజూ కూలిపనికి వెళుతూ జీవిస్తున్నారు. నిత్యం గొడవలతో గతంలో పలుమార్లు పెద్ద మనుషుల మద్య పంచాయతీలు జరిగాయి. కానీ ప్రసాద్ తీరు మార్చుకోకుండా తాగి నిత్యం గొడవలు చేసేవాడు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం తాగి ఇంటికి వచ్చిన ప్రసాద్ మళ్లీ భార్యతో గొడవకు దిగాడు. ఇదే సమయంలో కోపంతో ఇంటిపై ఉన్న సిమెంట్ రేకులను ధ్వంసం చేశాడు. దీంతో విసిగిపోయిన స్వరూప ఇంటి ముందు ఉన్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుంది. ఆమె చనిపోయిన విషయం గ్రహించిన ప్రసాద్ తనను అంతా కలిసి ఏం చేస్తారోనని భయపడి ఇంట్లోకి వెళ్లి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి పస్రా పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.