దైవ దర్శనానికి వెళ్తూ...

5 May, 2019 08:07 IST|Sakshi

దంపతులు దుర్మరణం మృతులు హిందూపురం వాసులుగా గుర్తింపు

దావణగెరె వద్ద రోడ్డు ప్రమాదం

హిందూపురం, యశ్వంతపుర: ఆమావాస్య రోజున దైవదర్శనానికి వెళ్తుండగా కర్ణాటకలోని దావణగేరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందూపురానికి చెందిన దంపతులు జెమిని శివప్రకాష్, ఉమాదేవిలు మృతి చెందారు. బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేస్తున్న శివప్రకాష్‌ అక్కడి రాజాజీనగర్‌ 6వ క్రాస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతులు శనివారం తెల్లవారుజామున ఉక్కడగాత్రీలోని హరిహర ఆలయానికి వెళ్లడానికి కారులో వెళ్తూ జాతీయ రహదారిలోని హోసకుండవాడ వద్ద కారు డివైడర్‌కు ఢీ కొనడంతో దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు.

హిందూపురంలోని ధనలక్ష్మిరోడ్డులో నివాసముంటున్న సత్యనారాయణకు ముగ్గురు సంతానం ఒక కొడుకు, ఇద్దరు కుమారైలు కొడుకు శివప్రకాష్‌ ఆడిటర్‌గా 15 సంవత్సరాల క్రితం వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. శివప్రకాష్, ఉమాదేవి దంపతులకు ఇరువురు సంతానం. బిటెక్‌ చదువుతున్న పెద్దకొడుకు మోదేష్, పదో తరగతి చదివే ప్రణ్‌వ్‌లున్నారు. పిల్లలను ఇంటివద్దను ఉంచి వీరు ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దంపతుల భౌతికకాయాలను స్వగ్రామమైన హిందూపురం రాత్రికి తీసుకువస్తున్నారు. ఉమాదేవి స్వగ్రామం సోమిందపల్లి దీంతో రెండుప్రాంతాల్లో బంధువులు సన్నిహితులు హిందూపురం చేరుకుని కన్నీరు మున్నీరౌతున్నారు.

మరిన్ని వార్తలు