భర్త గొంతు కోసి హైడ్రామా

25 May, 2019 10:41 IST|Sakshi
నిందితురాలు పూంగొడి

భార్య అరెస్టు

చెన్నై ,సేలం: ఇంట్లో భర్త గొంతు కోసి హత్య చేసి బయట తలుపులు వేసి అతడే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించేందుకు ప్రయత్నించిన కసాయి భార్యను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు సమీపంలోని తన్నీర్‌ పందల్‌ పాళయం గ్రామ పంచాయతీలోని మేడా మంగళం గ్రామంలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన నేత కార్మికుడు కల్యాణ సుందరం (66). ఇతను వివాహమై పిల్లలు ఉన్న స్థితిలో తనతో పనిచేస్తూ వచ్చిన పూంగొడి (46) అనే మహిళను కల్యాణ సుందరం రెండో పెళ్లి చేసుకుని, ఆమెతో జీవిస్తూ వచ్చాడు. వీరికి 21, 19 ఏళ్ల వయస్సులో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలాఉండగా, కల్యాణ సుందరంకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నట్టు పూంగొడికి తెలిసింది. ఇదే విధంగా పూంగొడి ప్రవర్తనలో కూడా కల్యాణ సుందరంకు సందేహం ఏర్పడింది. ఈ కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

కత్తితో గొంతు కోసి..
ఈ స్థితిలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు కల్యాణ సుందరం పనికి వెళ్లి వస్తానని తెలిపాడు. తాను కూడా అతనితో పాటు వస్తానని పూంగొడి పట్టుబట్టింది. రావొద్దని కల్యాణ సుందరం ఎంత చెప్పిన వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. కల్యాణ సుందరం తన చేతికి అందిన కత్తి చూపి తనతో వస్తే కత్తితో పొడిచేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన పూంగొడి కల్యాణ సుందరంను తోసివేసింది. అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కుని కల్యాణ సుందరం గొంతుకోసి హతమార్చింది. వెంటనే ఇంటి నుంచి వెలుపలికి వచ్చి తలుపులను మూసి వెలుపలి వైపు నుంచి గొళ్లెం తగిలించింది.

తలుపులు మూసి హైడ్రామా: ఇంటిలోపల గొంతు కోసిన స్థితిలో ప్రాణాలకు పోరాడుతున్న కల్యాణ సుందరం అతి కష్టం మీద లేచి తలుపు, కిటికీలు తట్టాడు. శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకోగా, ఇంటి బయట ఉన్న పూంగొడి కల్యాణ సుందరం కత్తితో తనను చంపడానికి వస్తున్నాడని, అందుకోసమే బయట తలుపులకు గొళ్లెం పెట్టినట్టు చెప్పి నమ్మించింది. తర్వాత కొంత సేపటికి ఇంటి నుంచి శబ్దం రాకపోవడంతో అక్కడున్న వారిని లోపలికి వెళ్లి కల్యాణ సుందరం ఏం చేస్తున్నాడో చూడమని కోరింది. అక్కడికి వెళ్లిన చూసిన వారు రక్తపు మడుగులో కల్యాణ సుందరం నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. దీంతో తన భర్త గొంతు కోసుకుని చనిపోయాడంటూ బోరున విలపించింది. 

తడబడి...పట్టుబడి: సమాచారం అంద.ుకున్న పోలీసు కమిషనర్‌ ఆరోగ్యరాజ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. పూంగొడి వద్ద విచారించగా తొలుత కల్యాణ సుందరం తనకు తానుగానే కత్తితో గొంతు కోసుకున్నట్టు తెలిపింది. అయితే, ఆ సమయంలో పూంగొడి మాటలు తడబడడంతో సందేహించిన పోలీసులు ఆమె వద్ద తీవ్ర విచారణ చేపట్టారు. తాను భర్త గొంతు కోసి హత్య చేసినట్టు పూంగొడి అంగీకరించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కల్యాణ సుందరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు