ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు సుపారి!

16 Mar, 2020 08:28 IST|Sakshi
 ఘటనా స్థలంలో ఏడుస్తున్న మృతుడి భార్య మమత  

సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. పథకం ప్రకారమే మమత ఆమె ప్రియుడు సురేశ్‌తో తిరుపతిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్‌హౌజ్‌ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద పని చేస్తున్న సురేశ్‌ యజమాని భార్య మమతపై కన్నేశాడు. అప్పటి నుంచి ఇద్దరు అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్‌తో కలిసి మమత పథకం రచించింది.

ప్లాన్‌ ప్రకారం తిరుపతిని హతమార్చేందుకు సురేశ్‌ రూ.40 వేలకు నలుగురు వ్యక్తులతో సుపారి కుదుర్చుకున్నాడు. మమత తనకు కడుపునొప్పి వచ్చిందని భర్తను అర్ధరాత్రి బస్వాపూర్‌కు తీసుకెళ్లింది. అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్‌ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. హ త్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ నిజం బయటకు వచ్చింది. హత్యకేసును చేధించడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.? త్వరలో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టేనున్నట్లు పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు