ప్రియునితో కలిసి భర్తనే కడతేర్చింది..

6 Apr, 2020 10:43 IST|Sakshi
భార్య రేణుకతో మృతుడు (ఫైల్‌)

చిత్తూరు, మదనపల్టె టౌన్‌ :  వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ఈ సంఘటన మదనపల్లెలో శనివారం రాత్రి జరిగింది.  పోలీసుల కథనం మేరకు..పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన కాలం చిన్నరెడ్డెప్ప చిన్న కుమారుడు బాలసుబ్రమణ్యం అలియాస్‌ బాలు(35) పదేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. నీరుగట్టువారిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమార్తె రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు రిష్మిత, జష్మిత, అభిరామ్‌ ఉన్నారు. బాలసుబ్రమణ్యం ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తితో రేణుక వివాహేతర సంబంధం కుదుర్చు కుంది. ఏడాదిగా భర్తతో తరచూ గొడవ పడుతోంది.

సంసారాన్ని అతడు తిరుపతికి కాపురం మార్చాడు. ఆమె అక్కడ ఉండకుండా ఆరు నెలలు తిరగకనే నీరుగట్టువారిపల్లెలోని అయోధ్యనగర్‌కు మకాం మార్చింది. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పథకం పన్నింది. కడప, మదనపల్లెకు చెందిన నలుగురు కిరాయి హంతకులతో రూ.4 లక్షలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంది. రెండు రోజుల క్రితం వైఎస్సార్‌ జిల్లాకు చెందిన లారీని చౌడేశ్వరీ కల్యాణ మండపం వద్దకు తెప్పించింది. శనివారం రాత్రి గొంతునొప్పి, దగ్గు వస్తోందని, మందులు తీసుకురావాలని భర్తను టమాట మార్కెట్‌ యార్డు వద్దకు బైక్‌లో పంపించింది. ఈ విషయం వెంటనే ప్రియునికి ఫోన్‌లో చేరవేసింది.

మందులు తీసుకుని బైక్‌లో వస్తున్న బాలసుబ్రమణ్యాన్ని దుండగులు కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లె డౌన్‌లో లారీతో బైక్‌ను ఢీకొని వెళ్లిపోయారు. బాలసుబ్రమణ్యం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంగా భావించిన పట్రోలింగ్‌ పోలీసులు లారీ కోసం గాలించారు. నిందితులు వాల్మీకిపురం వద్ద అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. విచారణలో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్ట ణ సీఐ తమీమ్‌ అహ్మద్, ఎస్‌ఐ సోమశేఖర్‌ సిబ్బందితో వెళ్లి నిందితురాలు రేణుక, ఆమె ప్రియుడు, హంతకులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు