ప్రముఖ వ్యాపారి భార్య అనుమానాస్పద మృతి కలకలం

22 Jan, 2020 20:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ సైకిల్ తయారీదారు అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్‌ కపూర్‌ భార్య నటాష్ కపూర్ (57) అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు  పోలీసులకు సమాచారం అందించారు. జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కూడా ఆత్మహత్యకు కారణమని అధికారులు భావిస్తున్నారు. 

ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్టుగా బుదవారం తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే  అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం నటాషా మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. లోధి రోడ్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు  నిర్వహించారు. పోలీసులు అందించిన  సమాచారం ప్రకారం  మధ్యాహ్న  భోజనానికి డైనింగ్‌ హాల్‌కు తల్లి రాకపోవడంతో నటాషా కుమారుడు సిద్ధాంత్‌ కపూర్‌ ఆమెకు ఫోన్‌ చేశారు.  తల్లి నుంచి  ఎలాంటి  స్పందనరాకవడంతో ఆమె గదికివెళ్లి  చూశాడు. అక్కడ ఆమె సీలింగ్ ఫ్యాన్‌ను వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురైన అతను కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మరోవైపు ఈ సమయంలో  కొడుకు, కుమార్తె ఇంట్లోనే వుండగా, భర్త సంజయ్‌ కపూర్‌ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు