భర్త సరిగా చూసుకోవడం లేదని ఆత్మహత్య

20 May, 2019 08:29 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి

మృతురాలు రెండోభార్య నెలరోజుల క్రితమే పెళ్లి

అమీర్‌పేట: మొదటి భార్య ఉండగా ఓ వ్యక్తి నెల రోజుల క్రితం మరో మహిళను  వివాహం చేసుకున్నాడు. ఆమెను సరిగా చూడక పోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ అశోక్‌ తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన చెన్నకేశవుల మొదటి భార్యను సొంత ఊరిలో ఉంచి  బతుకుదేరువు కోసం కొంత కాలం క్రితం నగరానికి వచ్చాడు. మోతీనగర్‌లో ఉంటూ కూలిపని చేసుకునే చెన్నకేశవులు లక్ష్మీ (24)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కాగా మొదటి భార్యతో చనువుగా ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్నావంటూ లక్ష్మీ చెన్నకేశవులుతో గొడవ పడుతూ వస్తుంది.

శనివారం రాత్రి ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.దీంతో  తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.లక్ష్మీ లోపలికి వెళ్లిన విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు విరగగొట్టి చూడా  లక్ష్మీ అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల  కారణాలపై విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు