అనుమానం పెనుభూతమై.. 

5 Apr, 2020 08:55 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

భార్యను దారుణంగా కడతేర్చిన భర్త

హొళగుందలో ఘటన

సాక్షి, హొళగుంద: జీవితాంతం తోడుగా ఉండా ల్సిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. అనుమానంతో అతి కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణ సంఘటన శనివారం హొళగుందలో చోటు చేసుకుంది. ఆలూరు సీఐ భాస్కర్, హొళగుంద ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేటకు చెందిన బోడే మల్లికార్జునకు హొళగుందకు చెందిన సావిత్రితో (49) 24 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. ఎల్రక్టీషియన్‌ పని చేసే మల్లికార్జున గత కొన్నేళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.

వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేక భర్తతో గొడవపడి మార్చి 22న పుట్టింటికి వెళ్లింది. ఈనెల 1 హొళగుందకెళ్లిన మల్లికార్జున భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున భార్య నిద్రలో ఉండగా తలపై ఇనుపరాడ్‌తో మోది పరారయ్యాడు. తలకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఉదయం హతు రాలి తమ్ముడు రాము గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆలూరు సీఐ, ఎస్‌ఐ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా తల్లి మరణంతో కుమార్తె, కుమారులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

>
మరిన్ని వార్తలు