ప్రాణం తీసిన బిర్యానీ

27 Jun, 2020 09:27 IST|Sakshi

భర్తపై అలిగి భార్య ఆహుతి

సాక్షి, చెన్నై: తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మాహుతి చేసుకుంది. మహాబలిపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. మహాబలిపురంలోని శిల్ప తయారీ సంస్థలో మనోహరన్‌ పనిచేస్తున్నాడు. గురువారం తనకు బిర్యానీ తినాలని ఆశగా ఉందని, కొనిపెట్టాలని భర్తను శరణ్య కోరింది. అంతంత మాత్రమే నగదు ఉందని, మళ్లీ చూద్దామన్నట్టు చెప్పి ఇంటి నుంచి మనోహరన్‌ బయటకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన  శరణ్య భర్త మీద కోపంతో ఆయన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను తీసి, తనపై పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటల్ని ఆర్పి ఆమెను చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య మృతిచెందింది.

మరిన్ని వార్తలు