కట్టుకున్నోడే కడతేర్చాడు..

31 May, 2018 13:51 IST|Sakshi
 భర్త దస్తగిరితో ఖాశీంబి(ఫైల్‌)  

అనుమానంతో భార్యను అంతమొందించిన భర్త

కనకాద్రిపల్లెలో ఘటన

పరారీలో నిందితుడు

కొలిమిగుండ్ల : కడదాకా ఏకష్టం రాకుండా చూసుకుంటానని బాస చేసిన భర్తే అనుమానంతో భార్యను కడతేర్చాడు. ఈఘటన కనకాద్రిపల్లెలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల చిన్నదస్తగిరికి బండిఆత్మకూరు మండలం బి.కోడూరుకు చెందిన ఖాశీంబి(35)తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. దస్తగిరి లోడింగ్‌ కార్మికుడిగా పని చేసేవాడు.

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో  రెండు నెలల నుంచి జి.కోడూరులోని అత్తగారింట్లోనే ఉంటున్నారు. దస్తగిరికి నంద్యాలలోని ఓ కిరాణా దుకాణంలో పని చూపించారు. పొదుపు గ్రూపులో బ్యాంక్‌లో రుణం పొందేందుకు ఐదు రోజుల క్రితం భార్యభర్తలు స్వగ్రామానికి పిల్లలతో కలసి ఇద్దరు వచ్చారు. ఉదయమే ఉపాధి పనికి వెళ్లి మధ్యాహ్నం 12 గంటల్లోపే భార్య ఇంటికి చేరుకుంది.

పవిత్ర రంజాన్‌ మాసం కావడంతో 11 ఏళ్ల కుమారుడు ఇంటికి అతి సమీపంలో ఉన్న మసీదుకు ప్రార్థనకు వెళ్లాడు. ఇద్దరు కుమార్తెలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఈసయమంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన భర్త భార్య తల వెనుక భాగంలో కత్తితో దాడి చేశాడు. మసీదులో ఉన్న కుమారుడి దగ్గరకు వెళ్లి ‘మీ అమ్మ చావుబతుకుల  మ«ధ్య ఉందంటూ’ చెప్పి పరారయ్యాడు.

కుమారుడు బోరున ఏడ్చుకుంటూ పరుగున ఇంటి వద్దకు చేరుకున్నాడు. చుట్టు పక్కల ప్రజలు లోపలకు వెళ్లి చూడగా ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. మానవతా ఆంబులెన్స్‌లో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య  ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు