దారుణం..

28 Dec, 2018 12:42 IST|Sakshi
సదాశివరెడ్డి మృతదేహం

కంటి‘పాప’ను కాటేయబోయిన తండ్రి

సహనం కోల్పోయి భర్తను కడతేర్చిన భార్య

కామంతో కళ్లు మూసుకుపోయిన భర్తను కడతేర్చిన భార్య ఉదంతమిది. వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా భార్య భరించింది. తాగొచ్చి హింసించినా సర్దుకుపోయింది. కుమార్తె అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడంతో సహనం కోల్పోయి దాడి చేయడంతో భర్త ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అనంతపురంలో గురువారం చోటు చేసుకుంది.  

అనంతపురం సెంట్రల్‌: కొత్తచెరువు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పీఈటీ సదాశివరెడ్డి హత్యకు గురయ్యాడు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న ఈయనకు పాతికేళ్ల కిందట శోభా అనే మహిళతో వివాహమైంది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత నుంచి తాగుడుకు బానిసయ్యాడు. దీనికి తోడు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. కళ్యాణదుర్గంలో పనిచేసే సమయంలో వివాహేతర సంబంధం కొనసాగించిన మహిళను ఏకంగా అనంతపురం తీసుకొచ్చి రాంనగర్‌లో వేరు కాపురం పెట్టాడు.

జీతం డబ్బులు తాగుడుకు, వివాహేతర సంబంధాలకు వెచ్చిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. వారానికి, రెండువారాలకోసారి ఇంటికి వచ్చి తాగిన మత్తులో భార్య, పిల్లలను కొడుతూ చిత్రవధకు గురి చేసేవాడు. అయినా వారు అలాగే భరిస్తూ వస్తున్నారు. బుధవారం రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చి న సదాశివరెడ్డి భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా లేసి కూతురితో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించాడు. దీన్ని చూసి భరించలేని ఆయన భార్య రీపర్‌ కట్టెతో తలపై మోదింది. అంతే.. నిమిషాల్లో ఆయన ప్రాణం కోల్పోయాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగు చూసింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ ఆరోహణరావు తెలిపారు.

మరిన్ని వార్తలు