వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

16 Oct, 2019 11:02 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

ప్రియుడితో కలిసి భర్త హత్య

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

ఎల్‌బీనగర్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళతో పాటు, ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా, తండాకు చెందిన ఇస్లావత్‌ ప్రసాద్‌బాబు, సరోజ దంపతులు నగరానికి వలసవచ్చి ఇంజపూర్‌లో  నివాసం ఉంటున్నారు. ప్రసాద్‌ బాబు ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా, సరోజ వెలుగు ప్రాజెక్ట్‌లో బుక్‌ కీపర్‌ పనిచేసేది. దీనికితోడు ప్రసాద్‌ బాబు  చిట్స్‌  వ్యాపారం చేసేవాడు.  వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. అప్పుదారులు ఇంటికి వస్తుండటంతో అతను ఇంటికి రాకుండా స్నేహితుల వద్దే తలదాచుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న నర్సింహ్మతో  సరోజకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయం తెలియడంతో ప్రసాద్‌ బాబు గత కొద్ది రోజులుగా సరోజను కొడుతున్నాడు.

దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు నర్సింహకు విషయం చెప్పింది. పథకం ప్రకారం ఈ నెల 6న  నర్సింహ తన బంధువు అయాన రామకృష్ణకు విషయం చెప్పి అతడిని ప్రసాద్‌ ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరిని సరోజ భర్తకు పరిచయం చేసి పైనాన్స్‌ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపింది. అనంతరం అందరూ కలసి మద్యం తాగారు. పథకం ప్రకారం మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ బాబు మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు.  నర్సింహ్మ, రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లి పోయారు. 7న ఉదయం తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని సరోజ తన సోదరుడు లక్ష్మణ్‌తో పాటు బంధువులకు సమాచారం అందించింది. అందరూ కలిసి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు. అయితే బంధువుల్లో కొందరు ప్రసాద్‌ బాబు మెడకు ఉరిబిగించిన గుర్తులను చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సరోజను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్ధలిపురం ఏసీపీ శంకర్, సీఐ వెంకటయ్య సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు