వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!

20 Nov, 2019 09:59 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐ 

 ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

పత్తిచేనులో శవాన్ని పడేసిన వైనం

కేసును చేధించిన పోలీసులు

సాక్షి, కాగజ్‌నగర్‌(ఆదిలాబాద్‌) : తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని  ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటన దహెగాం మండలం రాళ్లగూడెం గ్రామంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. పోలీసులు తక్కువ సమయంలోనే కేసును చేధించి నిందితులను పట్టుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.లక్ష్మినర్సింహస్వామి, రూరల్‌ సీఐ అల్లం నరేందర్‌ వివరాలు వెల్లడించారు. రాళ్లగూడ గ్రామానికి చెందిన రౌతు బండు(38), భార్య కవిత. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. కవిత ఏడాదిగా కాగజ్‌నగర్‌ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కొట్రంగి బిక్కుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం బండును హత్య చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ నెల 17న రాత్రి బండు ఇంట్లో నిద్రిస్తుండగా కర్రతో తలపై దాడి చేసి హతమార్చారు. అనంతరం అనుమానం రాకుండా బిక్కు ద్విచక్రవాహనంపై మృతుడి శవాన్ని తీసుకెళ్లి బిబ్రా శివారులోని పత్తి చేనులో పడేశారు. సోమవారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. భార్య కవితను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. మృతుడి సోదరుడు రౌతు కొండయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రఘుపతి, మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ సమీనా,  సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు