అడ్డు అని అంతమొందించారు!

3 May, 2019 11:57 IST|Sakshi
నిందితులను అరెస్టును చూపుతున్న సీఐ

కర్నూలు, మద్దికెర: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అడ్డు తొలగించిన భార్య ఉదంతం ఎట్టకేలకు బహిర్గతమైంది. ఈ మేరకు భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు పత్తికొండ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం సీఐ వివరాలను విలేకరులకు తెలిపారు. గత నెల 25న మద్దికెర రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న పాడుబడిన క్వార్టర్స్‌లో గుర్తుతెలియని మృతదేహాన్ని కనుగొన్న విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన పోలీసులు ఈ హత్యకు భార్య నాగలక్ష్మీ, ప్రియుడు రామావత్‌ బజ్నునాయక్‌గా గుర్తించారు.  డోన్‌ మండలం నక్కవాగుల పల్లి గ్రామానికి చెందిన హతుడు గొల్ల లక్ష్మన్న డోన్‌ పట్టణంలో హోటల్లో పని చేస్తూ జీవనం సాగించేవాడు.

ఆయన భార్య నాగలక్ష్మి రైల్వే పనులకు వెళుతూ డోన్‌ కొండపేటకు చెందిన రిటైర్డ్‌ రెల్వే ఉద్యోగి బజ్నునాయక్‌తో వివాహేతర సంబంధం కొనసాగించేంది. భార్యపై అనుమానంతో లక్ష్మన్న భార్యను వేధిస్తుండేవాడు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించారు. భార్య ప్రమేయంతో బజ్నునాయక్‌ ఏప్రిల్‌ 25న మద్దికెరకు పిలిపించి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాపి మత్తులో ఉన్న లక్ష్మన్నను రాయితో కొట్టి చంపారు. సెల్‌ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టగా మృతుడి చావుకు భార్య, ప్రియుడే కారణమని భావించి అరెస్టు చేశారు. అనంతరం విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ప్రియుడు ఒప్పుకున్నారన్నారు. గురువారం వీరిద్దరూ అనంతపురం జిల్లా కసాపురం దేవస్థానికి వెళ్లివస్తున్నారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసు త్వరగా చేధించడంతో సిబ్బందిని అభినందించారు. ఎస్‌లు మారుతి, శ్రీనివాసులు హెడ్‌ కానిస్టేబుల్‌ రెడ్డిహుస్సేన్, పోలీసులు ఆనంద్, మదర్‌సాబ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు