భర్త పట్టించుకోవడం లేదని..

10 Nov, 2018 11:07 IST|Sakshi
హత్యకు గురైన దంపతులు

ప్రియుడితో కలిసి భర్త, రెండో భార్యను హతమార్చిన మొదటి భార్య

వేలూరు: ప్రేమికుడితో కలిసి భర్త, రెండో భార్యను హత్య చేయించిన మొదటి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన తిరుపత్తూరు సమీపంలో చోటుచేసుకుంది.  వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలోని ఈచనేరి గ్రామానికి చెందిన షణ్ముగం(40) రైతు. ఇతని భార్య కళ. దంపతులకు ఆనందన్, నందని అనే ఇద్దరు పిల్ల లున్నారు. ఈ నేపథ్యంలో కళకు అదే గ్రామంలోని ఏకాంబరంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న షణ్ముగం భార్య కళను మందలించాడు.  గతేడాది కళ ప్రేమికుడు ఏకాంబరంతో పరారై కేరళలో నివశిస్తున్నారు. దీంతో షణ్ముగం ఆరు నెలల క్రితం సింగారపేటకు చెందిన సుజాత(30)ని రెండవ వివాహం చేసుకున్నాడు.  విషయం తెలుసుకున్న కళ గత నెలలో ప్రేమికుడితో కలిసి కేరళ రాష్ట్రం నుంచి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తాను భర్తతో కలిసి జీవించేందుకు అనుమతించాలని గ్రామంలో పంచాయతీ పెద్దల సమక్షంలో తెలిపింది. అనంతరం కళ షణ్ముగం ఇంట్లోనే ఉండిపోయింది. అయితే భర్త కళతో మాట్లాడకపోవడంతో పాటు రెండవ భార్యతోనే కలిసి జీవిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేక కళ ప్రేమికుడితో కలిసి భర్త, రెండో భార్యను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం హత్య..
గురువారం రాత్రి భర్త షణ్ముగం, రెండవ భార్య సుజాత ఇంట్లో నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఏకాంబరం, అతని అనుచరులు కలిసి షణ్ముగం, సుజాత తలపై ఇనుప రాడ్‌తో దాడిచేసి పరారయ్యారు. శుక్రవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు షణ్ముగం మొదటి భార్య కళ, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. కళ ప్రేమికుడు ఏకాంబరం పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు