ప్రాణం తీసిన వివాహేతర బంధం

6 Oct, 2018 14:01 IST|Sakshi
హత్యకు గురైన రాంబాబు మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ దిలీప్, ఎస్‌ఐ సురేష్‌

గుంటూరు, విజయపురిసౌత్‌: వివాహేతర సంబంధ నేపథ్యంలో భార్య తన భర్తను కడతేర్చింది. ఈ ఘటన విజయపురిసౌత్‌లోని డౌన్‌మార్కెట్‌లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానిక డౌన్‌మార్కెట్‌కు చెందిన సోరాడ రాంబాబు(30) కృష్ణా జలాశయంలో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  తొమ్మిదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. మల్లేశ్వరి గత కొంత కాలంగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి రాంబాబు ఇంటికి మద్యం సీసాలను, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని మద్యం సేవించాడు. అర్థరాత్రి మద్యం మత్తులో ఉన్న రాంబాబు మెడకు చీరను బిగించి మల్లేశ్వరి ప్రియుడి సహాయంతో హత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

మల్లేశ్వరి రాత్రి హత్య జరిగిన తరువాత చుట్టుపక్కల ఇళ్ల వాళ్లని లేపి రాంబాబు విరోచనాలు, రక్త వాంతులతో స్పృహ కోల్పోయాడని తెలిపింది. రాంబాబును ఆటోలో హుటాహుటిన హిల్‌కాలనీ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మృతి చెందిననట్లు డాక్టర్లు ధ్రువీకరించటంతో మృతదేహాన్ని విజయపురిసౌత్‌లోని స్వగృహానికి తరలించారు. బంధువుల ద్వారా రాంబాబు హత్య వార్త తెలుసుకున్న విజయపురిసౌత్‌ ఎస్‌ఐ సీహెచ్‌ సురేష్, మాచర్ల రూరల్‌ సీఐ దిలీప్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం అనంతరం రాంబాబు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు