భర్తకు విషపు ఇంజక్షన్‌ ఇచ్చి హత్య

10 Dec, 2018 11:15 IST|Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడని భార్య ఘాతుకం

హత్యోదంతాన్ని బయట పెట్టిన పిల్లలు

నిందితురాలి అరెస్ట్, ప్రియుడు, అతని మిత్రుల కోసం గాలింపు

కర్ణాటక, హొసూరు: వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని హితవు చెప్పిన భర్తకు ప్రియుడితో కలిసి విష ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా జంబుకూడబట్టి గ్రామంలో రాజలింగం(35), సోనియా(25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి జీవ, హరి అనే ఇద్దరు     కుమారులు ఉన్నారు. కాగా సోనియాకు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఈ వ్యవహారం బయట పడటంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. అనైతిక సంబంధాన్ని మానుకోవాలని రాజలింగం హితవు పలికాడు. అయితే సోనియా భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది.

శనివారం రాత్రి రాజలింగం కూలిపనులకెళ్లి ఇంటికి రాగా అప్పటికే  అక్కడకు చేరుకున్న సోనియా ప్రియుడు తన మిత్రులతో కలిసి రాజలింగం నోటిలో బట్టలు ఉంచి ఇంజక్షన్‌ వేసి హత్యచేశారు. అనంతరం మృతదేహానికి ఉరి వేశారు. తర్వాత సోనియా పెద్దగా కేకలు వేస్తూ ఇంటినుంచి బయటకు వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రోదించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. రాజలింగం పిల్లలతో విచారణ జరిపారు. అయితే అక్కడ జరిగిన ఉదంతాన్ని పిల్లలు పోలీసులకు వెల్లడించడంతో సోనియాను అరెస్ట్‌ చేశారు.  ఆమె సెల్‌ఫోన్‌ నుంచి ప్రియునికి ఫోన్‌ చేయించగా అతను పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు పలు ప్రాంతా ల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. 

మరిన్ని వార్తలు