గోర్లు పీకి, రాడ్లతో కొట్టి

29 Jan, 2020 08:13 IST|Sakshi
భర్త సుబ్రమణ్యంతో రశ్మి (ఫైల్‌)

రెండవ భర్తను చంపిన మహిళ  

నిందితురాలు బెంగళూరులో ఐటీ ఇంజనీరు  

హతుడు ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌  

చామరాజనగర జిల్లాలో ఘోరం  

మానవ సంబంధాలన్నీ డబ్బుమయం అవుతున్నాయి. దారి తప్పి నేరాల పాలవుతున్నాయి. డబ్బుల విషయమై ఓ మహిళ రెండో భర్తను కిడ్నాప్‌ చేయించి కొన్నిరోజుల పాటు హింసించింది. వీరిద్దరూ బెంగళూరులో ఉన్నత ఉద్యోగులే. బాధితుడు మంగళవారం మైసూరులో మృత్యువాత పడ్డాడు. నిందితురాలిని అరెస్టు చేయగా, మిగతావారు పరారీలో ఉన్నారు.

కర్ణాటక, బొమ్మనహళ్లి: నగదు వ్యవహారంలో భార్యభర్తల మధ్య వచ్చిన గొడవలో భర్త ప్రాణం పోగొట్టుకున్నాడు. భార్య తన సోదరుడు, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి భర్తను కిడ్నాప్‌ చేసి సుమారు ఐదు రోజుల పాటు ఇంట్లో బంధించిచిత్రహింసలకు గురిచేసింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం  చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల సమీపంలో ఉన్న ముడిగుండం గ్రామంలో జరిగింది. మృతుడు బెంగళూరులో ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసే ముడిగుండంవాసి సుబ్రమణ్యం (36).  నిందితురాలు బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రశ్మి. ఆమెను కొళ్లెగాల పోలీసులు అరెస్టు
చేసి విచారిస్తుండగా, ఆమె సోదరుడు రాకేష్, అతని స్నేహితులు ప్రదీప్, రాకేష్‌ పడగూరు పరారీలో ఉన్నారు.

ఐదురోజులూ చిత్రహింసలు  
రశ్మి సోదరుడు రాకేష్‌తో కలిసి తన భర్తను బెంగళూరులో కిడ్నాప్‌ చేసి ముడిగుండంకి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టసాగింది. సుబ్రమణ్యం చేతి గోళ్ళను పీకివేయడంతోపాటు ఇనుప కడ్డలతో కొట్టి హింసించారు. చివరకు అతని ఇంటివద్ద పడేసి పరారయ్యారు. చుట్టుపక్కల వారు గ్రహించి కొళ్ళెగాలలో ఉన్న ప్రవేట్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కొసం మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరళించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మంగళవారం చనిపోయాడు. కొళ్ళెగాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సుబ్రమణ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రశ్మిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. సుబ్రమణ్యం బెట్టింగ్‌ కోసం తన డబ్బులు మొత్తం తీసుకొని పోగొట్టాడని, వాటి కోసమే ఈ రగడ జరిగిందని రశ్మి పోలీసులకు తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది. 

ఏం జరిగింది 
రశ్మికి పెళ్ళి జరిగి సుమారు 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది.  నాలుగు సంవత్సరాల క్రితం సుబ్రమణ్యంను ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకుంది. ఏడాది పాటు బాగానే ఉన్నారు. ఇటీవల అతనితో ఘర్షణ పడి మళ్లీ మొదటి భర్తకు వద్దకు వచ్చి ఆరునెలలు ఉంది. మళ్లీ రెండవ భర్త వద్దకు వెళ్లిపోయింది. సుబ్రమణ్యం నుంచి ఆమె లక్షల రూపాయలు తీసుకుంది. ఆ డబ్బులు ఇవ్వాలని అతడు అడగడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. తన నుంచి తీసుకున్న ఐదు లక్షలను తిరిగి ఇవ్వాలని ఆమె కూడా సుబ్రమణ్యాన్ని డిమాండ్‌ చేయగా ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది.

మరిన్ని వార్తలు