కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన బైక్

16 Feb, 2020 21:55 IST|Sakshi

భార్య గల్లంతు, ప్రాణాలతో బయటపడ్డ భర్త

సాక్షి, కరీంనగర్‌: తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ శివారులో రాజీవ్‌ రహదారిపై ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ కాకతీయ కెనాల్‌ వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో భార్య సృజన గల్లంతు కాగా, భర్త ప్రదీప్‌ ప్రాణాలతో బయటపడ్డారు. గన్నేరువరానికి చెందిన దంపతుల కరీంనగర్‌ వచ్చి తిరిగి ప్రయాణం కాగా, మార్గమధ్యలో కళ్లలో పురుగులు పడగా బైక్‌ అదుపు తప్పింది. ప్రదీప్‌ను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతయిన సృజన కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆదివారం ఉదయం అలుగనూరు-మానేరు బ్రిడ్జిపై  ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. కరీంనగర్‌లోని శుభాష్‌నగర్‌కు చెందిన గడ్డి శ్రీనివాస్‌, అతని భార్య సునీత, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ బ్రిడ్జి పైనుంచి కాలువలో పడిపోయింది. దీంతో కారు నడుపుతున్న శ్రీనివాస్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. సునీత, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే కానిస్టేబుల్‌ అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన కరీంనగర్‌ వన్‌టౌన్‌లో పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు