భర్త హత్యకు పక్కాగా స్కెచ్‌

4 Jun, 2020 08:21 IST|Sakshi
నిందితులు వినయ్, లక్ష్మయ్య

ప్రియుడితో కలిసి వ్యూహరచన  

రెండుసార్లు హత్యాయత్నం

నిందితుల అరెస్ట్‌ పరారీలో భార్య

వడ్డిపల్లి శివయ్యపై హత్యాయత్నం కేసును

ఛేదించిన పోలీసులు

నూరేళ్లు కలిసి జీవిస్తామని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు గాలికొదిలేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే పైలోకాలకు పంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసింది. రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడినా బాధితుడు అదృష్టవశాత్తు మృత్యువు నుంచి బైటపడ్డాడు.  ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితురాలు పరారీలో ఉంది.  

చిత్తూరు ,తిరుపతి రూరల్‌:  తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం పంచాయతీ వడ్డిపల్లికి చెందిన బత్తల శివయ్యపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం ఎస్‌ఐ పరమేశ్వరనాయక్‌ వివరాలు వెల్లడించారు. పదేళ్లు కాపురం చేసి, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత సమీప బంధువులక్ష్మయ్యతో శివయ్య భార్య సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడాది కిందట ఆమెను భర్త పుట్టింటికి పంపించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని బరితెగించింది.(కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి..  )

ప్రియుడిని రెచ్చగొట్టింది. గత మార్చి 21న ఐరన్‌ రాడ్‌తో శివయ్యపై దాడి జరిగింది. మే నెల 23న కత్తితో నరికారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధంతోనే శివయ్యను హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నాలు చేసినట్లు, శివయ్య భార్య సుజాతను ఇందులో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ప్రియుడు లక్ష్మయ్యతో కలిసి ఈ హత్యయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. మార్చి 21న ఐరాన్‌రాడ్‌తో చంపేందుకు ప్రయత్నించిన సమయంలో శివయ్యకు తలకు తీవ్రగాయమైంది. తర్వాత చిగురువాడకు చెందిన వినయ్‌తో కలిసి మే 23న సాయంత్రం వడ్డిపల్లికి సమీపంలోనే కత్తితో పొడిచి శివయ్యపై హత్యయత్నానికి లక్ష్మయ్య ప్రయత్నించాడు. ముఖంపై కత్తితో నరికాడు. మరోసారి పొడిచేందుకు ప్రయత్నించడంతో శివయ్య కేకలు వేశాడు. దీంతో పరార్‌ అయ్యారు. నిందితులు వినయ్, లక్ష్మయ్యను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో నిందితురాలైన శివయ్య భార్య సుజాత పరారీలో ఉందని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు