భర్త ఇంటి ముందు పోరాటం

11 Apr, 2019 10:32 IST|Sakshi
బిడ్డతో భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్న పవిత్ర

అన్నానగర్‌: తనతో కలిసి జీవించాలని కోరుతూ ఓ మహిళ రెండు నెలల బిడ్డతో మంగళవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. చెన్నై కొరుక్కుపేట, ఎలిల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్‌ (28)కు తండయారుపేటకు చెందిన పవిత్ర (33)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన కొన్ని నెలల్లో రమేష్‌కుమార్‌ తండ్రి మృతి చెందాడు. భార్య తన ఇంటిలో అడుగుపెట్టడం వల్లే తన తండ్రి మృతిచెందాడని రమేష్‌కుమార్‌ ఆమెను హింసించేవాడు. ఈ క్రమంలో పవిత్రని పుట్టింటికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత తీసుకెళతానని తెలిపాడు. అయితే పవిత్రకు ఆడపిల్ల పుట్టి రెండు నెలలైనా రమేష్‌కుమార్‌ ఆమెను తీసుకెళ్లలేదు. ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రమేష్‌కుమార్‌ ఇంటి ముందు బిడ్డతో కూర్చొని ధర్నాకు దిగింది. దీనిపై తండయారుపేట మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు