భర్త మరణం .. భార్యపాలిట శాపం

23 Dec, 2017 11:07 IST|Sakshi
భర్త రఘుపాల్‌రెడ్డి సంబంధించిన భూమి పత్రాలు చూపిస్తున్న భవాని

ఇంటి నుంచి గెంటివేసిన అత్తామామ

న్యాయం చేయాలని కొడుకుతో కలసి మౌన పోరాటం

వరంగల్‌, మామునూరు: రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో అత్తింటి వారు ఆస్తి కోసం భార్యను ఇంటి నుంచి గెంటేశారు. తన భర్త పేరిట ఉన్న ఆస్తిని తన కుమారుడి దక్కేవిధంగా న్యాయం చేయాలంటూ అత్తింటి ఎదుట మౌన పోరాటం చేపట్టిన సంఘటన ఖిలా వరంగల్‌ మండలం ముస్కులపల్లిలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం పంతులపల్లి గ్రామానికి చెందిన ముస్కు సాంబరెడ్డి, సుగుణల కూతురు భవానిని 2008 సంవత్సరంలో ఖిలా వరంగల్‌ మండలం ముస్కులపల్లికి చెందిన ముస్కుల జయపాల్‌రెడ్డి, శోభ దంపతుల రెండో కుమారుడు రఘపాల్‌రెడ్డి(23)కు ఇచ్చి వివాహం చేశారు.  తల్లిదండ్రులు ఇచ్చిన మూడెకరాల భూమిలో ఈ దంపతులు రూ.25లక్షల వ్యయంతో డెయిరీఫాంను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత రఘుపాల్‌రెడ్డికి హన్మకొండ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సేల్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది.

విధి నిర్వహణలో భాగంగా డెయిరీఫాం భవాని అత్తమామలు జయపాల్‌రెడ్డి, శోభలకు అప్పగించి హన్మకొండలో ఆద్దెకుంటున్నారు. ఏప్రిల్‌ 2017 మాసంలో మామునూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రఘుపాల్‌రెడ్డి మృతిచెందాడు. కోడలిని అత్తింట్లో వారు దశదిన కర్మవరకు ఉంచి దుఖంలో ఉన్న కోడలిని ఆత్తంటివారు ఇంటి నుంచి గెంటేశారు. పెద్దల సమక్షంలో అనేక సార్లు పంచాయతీ పెట్టించారు. అత్తమామల వేధింపుల భరించలేక మామునూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ న్యాయం జరుగలేదు. భర్త రఘుపాల్‌రెడ్డి పేరిట ఉన్న డైయిరీఫాం, మూడెకరాల భూమిని లాక్కోవడమే కాకుండా ఇంటి నుంచి గెంటేశారు. దీంతో తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ముస్కులపల్లిలో అత్తింటి ఎదుట బాధితురాలు కుమారుడు భావితేజ్‌రెడ్డి, తన తల్లి సుగణతో కలిసి మౌన పోరాటం చేపట్టింది. ఇది తెలుసుకు న్న అత్తమామ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై యుగేంధర్‌ చేరుకుని మూడురోజుల్లో ఇంట్లో ఉండేవిధంగా న్యాయం చేస్తానని హ మీ ఇవ్వగా మౌన పోరాటాన్ని విరమించి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు