భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
కర్ణాటక, బనశంకరి: రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్రదుర్గ జిల్లా హుళల్కెరే పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు...చిత్రదుర్గ తాలూకా కొడగవళ్లిహట్టిలో ఆనంద్ (32), సుమా (28) దంపతులు నివాసముంటున్నారు. ఆనంద్, సుమా ప్రేమించుకుని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. ఆనంద్ హుళిల్కెరే పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన విదులు ముగించుకుని బైకులో వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆనంద్ మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె తీవ్ర మనోవ్యథకు గురవుతోంది. భర్తను తలుచుకుంటూ సుమా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని తనువు చాలించింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.