భర్త మందలించాడని భార్య బలవన్మరణం

1 Mar, 2019 11:52 IST|Sakshi

అన్నానగర్‌: భర్త మందలించాడనే మనస్థాపంతో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చెన్నై సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. చెన్నై మదురవాయల్‌ సమీపం నూంబల్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన నల్లయా (24) ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య గిరిజ (22) వలసరవాక్కంలోని ప్రైవేట్‌ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. ఇద్దరూ రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గిరిజ  సెల్‌ఫోన్‌లో అధికంగా మాట్లాడుతూ వచ్చినట్లు తెలిసింది. దీంతో భార్య, భర్తల మధ్య తగాదా ఏర్పడేది. బుధవారం రాత్రి పని ముగించి నల్లయా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు గిరిజ ఎప్పటిలాగే వంట చెయ్యకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలిసింది.

దీంతో భార్యను నల్లయా మందలించాడు. తరువాత నల్లయా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. మనస్థాపంతో ఉన్న గిరిజ హాల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మదురవాయల్‌ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గిరిజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీళ్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆర్‌డీఓ విచారణకు కోరినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు