ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు

15 Jan, 2019 10:10 IST|Sakshi
పోలీసులను ఆశ్రయించిన షమీనా, రుక్సార్‌ బేగం

అంగీకరించాలని భార్యపై ఒత్తిడి బెల్టుతో దాడి

అమీర్‌పేట: రెండు పెళ్లిలు చేసుకోవడమేగాక ముచ్చటగా మూడో పెళ్లికి సిద్దపడ్డాడో ప్రబుద్ధుడు అందుకు అంగీకరించాలని   భార్యను బాలింత అని కూడా చూడకుండా బెల్టుతో చితకబాదిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడబండ సైడ్‌ త్రీకి చెందిన మొహ్మద్‌ఖాన్‌ మొదట షమీనా బేగం, రెండో సారి రుక్సార్‌ బేగం అనే మహిళలను వివాహం చేసుకున్నాడు.

ఇద్దరు భార్యలకు ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. బ్యాగుల వ్యాపారం చేసే ఖాన్‌ ముడో పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డాడు. అందుకు అనుమతినివ్వాలని గత కొన్ని రోజులుగా రెండో భార్యను రుక్సార్‌ బేగంను వేధిస్తున్నాడు. ప్రసవమై 10 రోజుల క్రితమే ఇంటికి వచ్చిన ఆమెను హింసించసాగాడు. అంగీకారపత్రంపై సంతకం చేయాలని బాలింత అని చూడకుండా బెల్టుతో చితకబాదాడు. సంతకం పెట్టక పోతే బిల్డింగ్‌పై నుంచి తోసేసి చంపుతానని బెదిరించాడు. దీంతో తమకు న్యాయం చేయాలని ఇద్దరు భార్యలు షమీనా బేగం, రుక్సార్‌ బేగం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. మహిళా సంఘాల నాయకులు శ్రీలత,లత వారికి మద్దతు పలికారు.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు.  

మరిన్ని వార్తలు