యస్‌ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట

9 Mar, 2020 17:33 IST|Sakshi

విత్‌ డ్రాయల్‌ ఆంక్షలు త్వరలోనే ఎత్తివేత

సాక్షి,  ముంబై: యస్‌ బ్యాంకు సంక్షోభంతో ఆందోళనలో పడిన బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట కలగనుంది. నగదు ఉపసంహరణకు సంబంధించి ఇటీవల ఆర్‌బీఐ విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేయ నుంది. యస్‌బ్యాంకు ఖాతాదారులు  ఈ వారాంతానికే ఎలాంటి పరిమితి లేకుండా తమ నగదును విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు కలగనుంది. ఈ విత్‌డ్రాయల్‌ను మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాత ఎత్తివేసే అవకాశం ఉందని కొత్తగా నియమితులైన యస్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎస్‌బీఐమాజీ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌  సోమవారం ప్రకటించారు. మొదట రూ.50,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం నెలరోజులు కాలపరిమితిగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం దానిని మార్చి 15వరకే పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ అకౌంట్లలోని నగదును ఎంతకావాలంటే అంత మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. యస్‌బ్యాంక్‌ కార్యకలాపాలను ఏప్రిల్‌ 3నాటికి పునరుద్దరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంకా యస్‌బ్యాంక్‌ను ఎస్‌బీఐలో విలీనం చేస్తారనే ఊహాగానాల్లో వాస్తవం లేదని, యస్‌ బ్యాంక్‌ స్వంతంత్రంగానే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మూలధనం సమకూర్చలేనప్పుడు మాత్రమే విలీనం అవసరమేర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరాలన్నింటిని మార్చి 14న వెల్లడిస్తామని తెలిపారు.

అటు యస్‌ బ్యాంకులో  49 శాతంవాటాల కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ  ఆమోదం తెలిపింది. తొలి దశలో భాగంగా ఎస్‌బీఐ రూ. 2450 కోట్లను యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం భారీ పతనంలో కూడా యస్‌ బ్యాంకు  షేర్ల  కొనుగోళ్లకు పెట్టుబడి దారులు ఆసక్తి  చూపారు.  దీంతో 32 శాతం ఎగిసిన యస్‌ బ్యాంకు  షేరు 21.35 వద్ద ముగిసింది. కాగా  యస్‌బ్యాంక్‌లో అక్రమాలు నేపథ్యంలో ఆర్‌బీఐ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకు లావాదేవీలపై నెల రోజుల పాటుమారటోరియం విధించింది. కేవలం రూ.50వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది. మరోవైపు యస్‌బ్యాంక్‌ పునరుద్ధరణకు ఆర్‌బీఐ సత‍్వర చర్యలు ప్రక్రియను వేగవంతం చేసింది.

చదవండి:  యస్‌ బ్యాంక్‌ రాణా కపూర్‌ అరెస్ట్‌!!

మరిన్ని వార్తలు