‘నువ్వు నాకు ఏడో భార్యవు’

3 May, 2018 11:54 IST|Sakshi
సమీర్‌, అతని ఏడో భార్య అఫ్షా

లఖ్‌నవూ, ఉత్తరప్రదేశ్‌ : ‘నువ్వు నాకు ఏడో భార్యవు’ అనే భర్త మాటల్ని సరదా తీసుకున్న భార్య అదే నిజమని తెలిసి హతశురాలైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన సమీర్‌ అనే వ్యక్తికి ఏడాది క్రితం లఖ్‌నవూకి చెందిన అఫ్షా అనే యువతితో వివాహం జరిగింది.

పెళ్లైన నాటి నుంచి పని పేరుతో తరచూ బయటి ఊళ్లకు సమీర్‌ వెళ్లి వస్తుండేవాడు. అలా వచ్చినప్పుడు అఫ్షాతో సరదాగా ‘నువ్వు నాకు ఏడో భార్యవు’ అంటూ ఆటపట్టిస్తుండేవాడు. సరదాకి అంటున్నాడని భావించిన అఫ్షా కూడా సమీర్‌ మాటలను అంతగా పట్టించుకోలేదు. అయితే నేహా అనే యువతి నుంచి తరచూ సమీర్‌కు ఫోన్లు వస్తుండటంతో అఫ్షాకు అనుమానం కలిగింది.

సమీర్‌ ఫోన్‌ను చెక్‌ చేసేందుకు ఆమె యత్నించడంతో అతను వారించాడు. దీంతో సమీర్‌కు తెలీకుండా అతని ఫోన్‌ను తెరచి నేహాకు కాల్‌ చేసింది. నేహా సమీర్‌ తన భర్త అని చెప్పడంతో అఫ్షా హతశురాలయ్యారు. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే అఫ్షాను ఎలాగైతే ఏడో భార్య అంటుండేవాడో, నేహాను సమీర్‌ తరచుగా తొమ్మిదో భార్య అనేవాడట. దీంతో సమీర్‌పై అఫ్షా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన పోలీసులకు తాను మూడు పెళ్లిళ్లే చేసుకున్నానని సమీర్‌ చెప్పడంతో అవాక్కవ్వడం వారి వంతైంది. ఒకరికి తెలీకుండా మరొకరిని కలుస్తూ అవసరానికి బ్యాంకుల ద్వారా సమీర్‌ డబ్బు పంపేవాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు