దారుణం: ఢిల్లీలో వృద్ధ దంపతుల హత్య

25 Apr, 2020 09:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాను కట్టడిచేయడానికి లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో పశ్చిమ ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతులు నిన్న (శుక్రవారం) హత్యకు గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు చావ్లాలోని పోలీసు కంట్రోల్‌ రూంకి ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైనట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పశ్చిమ ఢిల్లీలోని దుర్గా విహార్‌, ఫేజ్‌- 2 లో ఉన్న ఓ ఇంట్లో ఒకే మంచం మీద వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించాయి. వారి ముఖం మీద గాయాలు ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు.

మృతి చెందిన వృద్ధ దంపతులు రాజ్‌ సింగ్‌ (61), ఓంవతి (58)గా పోలీసులు గుర్తించారు.  వృద్ధ దంపతుల కోడలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్థారించారు. కాగా అత్తమామలకు, కోడలు కవితకు మధ్య ఆస్తి వివాదం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా కవిత.. తన భర్త సతీష్‌ సింగ్ ముందే అత్తమామలను హతమార్చినట్లు చేసినట్లు‌ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ హత్యలో సతీష్‌ సింగ్‌ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితురాలు కవితతో పాటు సతీష్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు