దారుణం: తల్లీకూతుళ్లపై గ్యాంగ్‌ రేప్‌

14 Jun, 2018 17:47 IST|Sakshi

మానవ మృగాళ్లు మరోసారి రెచ్చిపోయాయి. ఓ వ్యక్తిని చితకబాది.. చెట్టుకు కట్టేసి... అతని కళ్లేదుటే భార్య, కూతుళ్లను అతిదారుణంగా చెరబట్టాయి. బిహార్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ రేప్‌ కేసు వివరాల్లోకి వెళ్తే...

పట్న: గురౌరు బజార్‌లో క్లినిక్‌ నిర్వహిస్తున్న వైద్యుడు.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్లినిక్‌ మూసేసి, భార్య, కూతురితో మోటర్‌ బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో  రఫిగంజ్‌-గయ రోడ్డులో ఓ నిర్మానుష్య ప్రాంతం వద్ద హఠాత్తుగా 20 మంది వారిని చుట్టు మూగారు. మహిళ, ఆమె కూతురిని వేధించటం ప్రారంభించారు. ప్రతిఘటించబోయిన ఆ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేశారు. తుపాకీతో భయపెట్టి ఆ బాలిక(15), మహిళ(35)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న గ్రామస్థుల సాయంతో బాధితులు.. కొంచ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరి ఫిర్యాదు చేశారు. 

గంటల వ్యవధిలో అరెస్ట్‌... బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన కొంచ్‌ పోలీసులు కేసు నమోదు చేయటంలో జాప్యం చేశారు. దీంతో మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సెంట్రల్‌ జోన్‌ ఐజీ నయ్యర్‌ హసనైన్‌ ఖాన్‌ స్వయంగా కేసును పర్యవేక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్‌ చేశారు. కేసు నమోదైన గంటల వ్యవధిల్లోనే నిందితులందరినీ అరెస్ట్‌ చేయగలిగారు. అర్ధరాత్రే 11 మందిని.. మిగిలిన వారిని ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఊరు దాటకుండా నిలువరించటంలో సోనిదిహ్‌ గ్రామస్థులు సైతం పోలీసులకు సాయపడటం విశేషం. గ్రామ సరిహద్దుల్లో బారికేడ్లు అడ్డుపెట్టి, రాత్రంతా నిందితుల కోసం ఇంటింటికి తిరిగి గాలింపు చేపట్టగా.. చివరకు నిందితులందరినీ అరెస్ట్‌ చేయగలిగారు. ఇక  ఈ కేసు దర్యాప్తులో ఆ బృందం చేసిన మరికొన్ని చర్యలు వెలుగు చూశాయి. స్థానికంగా వెళ్తున్న కొందరు మహిళలను కూడా వేధించారని, ఇద్దరు యువకుల దగ్గర ఫోన్లు, డబ్బు లాక్కున్నట్లు తేలింది.

రాజకీయ విమర్శలు... తల్లీకూతుళ్లపై  గ్యాంగ్‌ రేప్‌ ఘటన బిహార్‌ను కుదిపేసింది. గురువారం ఉదయం ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వి యాదవ్‌ బిహార్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘బీజేపీతో కలిసిపోయాక సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం.. శాంతిభద్రతలను పట్టించుకోవటం పూర్తిగా మానేసిందని, మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని’ తేజస్వి విమర్శించారు.

మరిన్ని వార్తలు