కటకటాల్లో కి‘లేడి’

1 Nov, 2018 10:18 IST|Sakshi
అరెస్టయిన మహిళ

నగల షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్‌

రూ. 4.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం

నాగోలు: బుర్ఖా వేసుకుని నగల షాపుల్లో సేల్స్‌మెన్‌ దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న మహిళను చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేసి 4.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్‌ జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బడా రేఖ(29) నగరానికి వచ్చి కూకట్‌పల్లి మూసాపేట్‌లో నివాసముంటోంది. 2007లో ప్రేమ వివాహం చేసుకున్న రేఖ ఆర్ధిక పరిస్థితులు సరిగాలేకపోవడంతో వివిధ షాపుల్లో పనిచేసింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బుర్ఖా వేసుకొని నగల షాపులకు వెళ్లి సేల్స్‌మెన్‌ దృష్టి మళ్లించి చోరీలు చేసేది.

ఈ క్రమంలో చైతన్యపురి సరూర్‌నగర్‌ పంజాగుట్ట పరిధిలోని నగల షాపులలో చోరీలకు పాల్పడింది.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు సీసీ కెమరాల ఆధారంగా ఆమె గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఆమె వద్ద రూ.4 లక్షల 80 వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎల్‌బీనగర్‌ ఎసీపీ పృథ్వీధర్‌రావు, చైతన్యపురి డీఐ రాము, సీఐసుదర్శన్, ఎస్‌ఐ వెంకటేష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు