చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్‌

15 Dec, 2018 10:13 IST|Sakshi
సుశీల

సంతోష్‌నగర్‌: ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళను కంచన్‌బాగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి ఆమె నుంచి రూ.4,81,320 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంపాపేట్‌ డి–మార్ట్‌ ప్రాంతానికి చెందిన బుచ్చిరెడ్డి ఇంట్లో  మహంకాళి తోట ప్రాంతానికి చెందిన సుశీల పని చేసేది. బుచ్చిరెడ్డి పాఠశాలలో వసూలైన ఫీజుల మొత్తాన్ని ఇంట్లోని అల్మారాలో దాస్తుండగా గుర్తించిన సుశీల దానిని కొట్టేయాలని పథకం పన్నింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మొత్తాన్ని తస్కరించింది. రెండు రోజుల అనంతరం స్కూల్‌లో ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు బుచ్చిరెడ్డి తన ఇంట్లోని అల్మారా తెరిచి చూడగా డబ్బులు కనిపించకపోవడంతో పని మనిషి సుశీలపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు