విమానంలో బీజేపీ వ్యతిరేక నినాదాలు.. స్కాలర్‌ అరెస్ట్‌

4 Sep, 2018 09:17 IST|Sakshi

ట్యూటికోరిన్‌: తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎదుట బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ట్యూటికోరిన్‌ ఎయిర్‌పోర్టులో సోమవారం జరిగింది. కెనడాలో ఇండియన్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన లూయిస్‌ సోఫియా(28), సౌందరరాజన్‌లు ఇద్దరూ ఒకే విమానంలో ట్యూటికోరిన్‌కు వస్తున్నారు. సౌందరరాజన్‌, సోఫియా ముందు సీట్లో కూర్చున్నారు. సోఫియా అకస్మాత్తుగా ‘డౌన్‌ విత్‌ మోదీ-బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్ట్‌  గవర్నమెంట్‌’ అంటూ బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు.

దీంతో సౌందరరాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విమానం ట్యూటికోరిన్‌లో ల్యాండ్‌ కాగానే సోఫియాను అరెస్ట్‌ చేశారు. ఎయిర్‌పోర్టులో సౌందరరాజన్‌ మాట్లాడుతూ.. ఒక విమానంలో ప్రయాణించేటపుడు ఆ విధంగా అరుస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయవచ్చా? ఇది పబ్లిక్‌ ఫోరం కాద’ని ప్రశ్నించారు. దీని వెనక తీవ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఆమె ఒక సాధారణ ప్రయాణికురాలిగా కనిపించడం లేదని, తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పబ్లిక్‌ న్యూసెన్స్‌ కింద సోఫియాపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే లోకల్‌ కోర్టు ఆమెకు 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

సోఫియా తండ్రి కూడా బీజేపీ చీఫ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఇంతవరకు సౌందరరాజన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సోఫియా ఒక రచయిత, గణిత శాస్త్రవేత్త. స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌, చెన్నై-సేలం 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. గత మే నెలలో పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడంతో స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెల్సిందే. సోఫియాను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ తప్పుపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే.. ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలన్నారు.
 

మరిన్ని వార్తలు