దివ్యది హత్యే! 

6 Jun, 2020 08:30 IST|Sakshi
దివ్య (ఫైల్‌)

పోలీసుల అదుపులో నలుగురు 

మరో వ్యక్తి కోసం గాలింపు 

ఐదుగురు కలిసి హత్య చేసినట్లు అనుమానం 

సీతమ్మధార(విశాఖ ఉత్తర): అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరి నగర్‌లో ప్రాంతంలో గురువారం మృతి చెందిన యువతి దివ్య(22)ను హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా ఆదేశాల మేరకు కేసును ఈస్ట్‌ ఏసీపీ కులశేఖర్‌ ఆధ్వర్యంలో సీఐలు కోరాడ రామారావు, చౌదరి, శ్రీనివాసరావుతో పాటు ఎస్‌ఐలు సూర్యనారాయణ, శ్రీనివాస్, మహిళా ఎస్‌ఐ గౌరి, ఇతర సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేశారు.

యువతి మృతిని ముందుగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటికీ.. ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో హత్య అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో డబ్బు పంపకంలో తేడాతో హత్యకు దారి తీసినట్లు తెలిసింది. తన వాటా సంపాదన ఇవ్వలేదని దివ్య ప్రశ్నించడంతో వసంత అనే మహిళ మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. దివ్య ను గుండు గీయించి మూడు రోజులు భోజనం పెట్టకుండా గదిలో చిత్రహింసలు పెట్టి చంపినట్టు విచారణలో వెల్లడైంది. వారికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు వ్యక్తులు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. యువతి దివ్యను గాయపరిచిన, హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సామగ్రిని, పరికరాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల ప్రాంతాల వారి నుంచి వివరాలను పోలీసులు సేకరించారు.

మరిన్ని వార్తలు