ప్రియుడిపై పెట్రో దాడి

25 Nov, 2019 07:10 IST|Sakshi
వెంకటేష్‌, ఆషా

సాక్షి, చెన్నై : భార్యను విడిచి మహిళా పోలీసుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పోలీసుపై ప్రియురాలు పెట్రోలు పోసి నిప్పుపెట్టింది. ఈ ఘటన శనివారం తిరుముల్‌లైవాయిల్‌లో చోటచేసుకుంది. ఆవడి స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌ (31) సత్యమూర్తినగర్‌లోని పోలీసు క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు. సొంతూరు విల్లుపురం. ఇతనికి 2012లో జయతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇలావుండగా పులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆషా (32)తో వెంకటేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆషాకు అంతకు ముందే ధర్మలింగం అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్ల్లలు ఉన్నారు. ఈ విషయం జయకు తెలియడంతో భర్తను నిలదీసింది. అతడిలో మార్పు రాకపోవడంతో 2015లో కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లింది. కుమార్తె తండ్రితోనే ఉండిపోయింది. అనంతరం వెంకటేశ్‌ తన ప్రియురాలు ఆషాను క్వార్టర్స్‌కు తీసుకొచ్చాడు.

ఈ క్రమంలో వెంకటేశ్‌కు ఓ మహిళా పోలీసుతో సంబంధం ఉన్న విషయం ఆషాకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ఆమె శనివారం వెంకటేశ్‌ను నిలదీసింది. వెంకటేష్‌ మద్యం మత్తులో ఉండడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆషా అక్కడున్న పెట్రోలును వెంకటేశ్‌పై కుమ్మరించింది. దీంతో అతను బయటకి పరుగుతీస్తుండగా అగ్గిపుల్ల వెలిగించి అతనిపై వేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని కీల్పాక్కం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుముల్‌లైవాయిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తమన్‌ కేసు నమోదు చేసి ఆషాను విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు